కాళ్ళ పారాణి అరకముందే.. నవ వధువు ఆత్మహత్య
కాళ్ళపారాణి ఆరక ముందే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ప్రకాశం జిల్లా కంభం మండలం దేవనగరం గ్రామంలో చోటుచేసుకుంది. ఫిబ్రవరి 16వ తేదీన కుటుంబ సభ్యులు సుస్మితకు పెద్దారవీడు మండలం సిద్ది నాయుడు పల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కు వివాహం చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన వధువు స్వగ్రామమైన దేవనగరంలో తొలిరాత్రి కార్యం కూడా జరిపించారు.
మరుసటి రోజు అంటే 18వ తేదీ ఈరోజు ఉదయం వరకు అందరితో బాగానే మసలుకుంది. నవ వధువుకు బంధువుల పరామర్శ కూడా జరిగింది. ఇక పుట్టింటి నుంచి బయలుదేరి అత్తారింటికి వెళ్ళాలి. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో మధ్యాహ్నం సుస్మిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏం జరిగిందో ఎవరికీ అర్ధం కావడం లేదు.. ఇష్టంలేని పెళ్ళి చేశారా.. లేక ఇంకేమైనా జరిగిందా.. అనేది ఇంకా తేలలేదు.
అకస్మాత్తుగా సుస్మిత మంగళవారం(ఫిబ్రవరి 18) మధ్యాహ్నం ఎవరు లేని సమయాన్ని చూసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పెళ్ళికి వచ్చిన దగ్గరి బంధువులను కన్నీరు పెట్టించింది. ఉరి వేసుకున్న నవవధువు సుస్మితను కుటుంబ సభ్యులు కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇష్టంలేని పెళ్లి చేశారని నవ వధువు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.