పక్కింటి యువతి స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. చివరికి..

Crime Published On : Monday, February 3, 2025 12:00 PM

పక్కింటి యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసి చివరకు ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా పూల్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన గొండేటి తాతారావు, పార్వతి దంపతుల రెండో కుమారుడు భాస్కరరావు (30) వైజాగ్‌లోని ఫార్మాసిటీలోని ఒక కంపెనీలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. గాజువాక శ్రీనగర్‌ సమీపంలోని శ్రీరాంనగర్‌లో అద్దెకు ఉంటుడున్నాడు. పెళ్లి కాకపోవడంతో రూంలో ఒంటరిగానే ఉంటున్నాడు. శనివారం ఉదయం పక్కింటి యువతి స్నానం చేస్తుండగా మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీశాడు. ఇది గుర్తించిన యువతి కుటుంబసభ్యులు అతడిని నిలదీశారు. వెంటనే అతని ఫోన్‌ లాక్కొని వీడియోను డిలీట్‌ చేయించారు.

అనంతరం భాస్కరరావుపై యువతి కుటుంబసభ్యులు చేయి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా అతని తల్లిదండ్రులను పిలిపించి సంగతి చూస్తామని బెదిరించారు. అతన్ని ఓ గదిలో నిర్బంధించారు. విజయనగరంలో ఉండే తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి విషయం చెప్పి రప్పించారు. వారు వైజాగ్‌కు వచ్చిన తర్వాత తలుపులు తీసి చూడగా భాస్కరరావు నిర్జీవంగా కనిపించాడు. ఆ గదిలోని సీలింగ్‌ ఇనుపరాడ్డుకు కేబుల్‌ వైరుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడి ముఖంపై గాయాలున్నాయని, కావాలనే తన కుమారుడిని కొట్టి చంపేశారని భాస్కరరావు తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. భాస్కరరావు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువతి సహా మరో నలుగురు కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు.