Breaking News: రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ముంబై కోర్టు షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ముంబైలోని ఆంధేరి మెజిస్ట్రేట్ కోర్టు కేసు విషయంలో సంచలన తీర్పు వెలువరించింది. ఆర్జీవీ మీద నమోదైన కేసులో ఆయనను దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించింది. ఆర్జీవీ మీద ఏడేళ్ల క్రితం నమోదైన కేసులో నేడు తీర్పు వెలువరించింది.
గత ఏడేళ్లుగా చెక్ బౌన్స్ కేసు మీద విచారణ జరుగుతుండగా... వర్మ మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. దీంతో రాంగోపాల్ వర్మ మీద ఆగ్రహించిన ఆంధేరీ కోర్టు ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రాబోయే ఈ మూడు నెలల్లోపు ఫిర్యాదుదారుడికి రూ. 3.72 లక్షల పరిహారం వర్మ చెల్లించాలని, లేదంటే మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు.
2018లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రాంగోపాల్ వర్మపై ముంబై పోలీసులకు చెక్ బౌన్స్ కేసు ఫిర్యాదు చేశారు. తాజాగా ఇదే కేసు విషయంలో కోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది.