పద్మ భూషణ్ పై స్పందించిన బాలయ్య
సినీ రంగానికి చేసిన సేవలకు నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై బాలకృష్ణ స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. "నా ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు, యావత్ చలనచిత్ర రంగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.” అని పేర్కొన్నారు.
'నా తండ్రిగారైన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుండి ఆయన వారసుడిగా నేటి వరకు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు, నాపై తమ విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను.’ అని బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేశారు.