బస్సులో టికెట్ అడిగితే ఆ వీడియో చూపించారు.. ఆ తరువాత ఊహించని ట్విస్ట్
కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని వినూత్నంగా నిరసన తెలిపిన వైసిపి మహిళా నాయకులకు ఊహించని పరిణామం ఎదురైంది. తిరుపతి వైసీపీ ఇంఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ మహిళలు బస్సు ఎక్కి టికెట్ అడిగితే ఇదివరకు ఎన్నికల్లో చంద్రబాబు చేసిన ప్రచార వీడియోలను ట్యాబ్లలో ప్లే చేశారు. అందులో "నేను చెబుతున్నాను. బస్సులో ఫ్రీగా వెళ్లండి. టికెట్ అడిగితే.. మా అన్న చంద్రబాబు ఉన్నాడని చెప్పండి" అంటూ చంద్రబాబు చేసిన ప్రచారం ఉంది.
మహిళలు ఇలా చెయ్యడంతో ఏం చెయ్యాలో కండక్టర్కు అర్థం కాలేదు. ఆయన ఈ పథకం ఇంకా అమల్లోకి రాలేదనీ, టికెట్ తీసుకోవాలనీ చెప్పారు. కానీ వైసీపీ మహిళా నాయకులు టికెట్ తీసుకోడానికి ఒప్పుకోలేదు. తమ నిరసనను అలాగే కొనసాగించారు. దాంతో కండక్టర్ బస్సును రోడ్డు పక్కన ఆపించారు. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వచ్చి సర్ది చెప్పారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు. దాంతో తిరుపతి పోలీసులు భూమన అభినయ్ రెడ్డితో పాటు వైసీపీ మహిళల్ని అక్కడి నుంచి తరలించారు. పోలీసులు భూమన అభినయ్ రెడ్డి, మేయర్ శిరీష, తిరుపతి వైసీపీ పట్టణ అధ్యక్షుడు రవి చంద్రరెడ్డి సహా 35 మందిపై కేసు నమోదు చేశారు.