పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో దాదాపు గంటసేపు మాట్లాడినట్లు సమాచారం.
అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఇద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మార్క్ శంకర్ను పరామర్శించారు. చిన్నారి ఆరోగ్యం గురించి ఆరా తీసినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. సింగపూర్లోని ఒక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందించారు. కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే, పవన్ కళ్యాణ్ సింగపూర్ బయలుదేరి వెళ్ళారు. గాయం నుంచి కోలుకున్న మార్క్ శంకర్ను ఇండియాకు తిరిగి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ తన భార్యతో కలిసి వెళ్లి మరీ మార్క్ శంకర్ను పరామర్శించారు. ఇదిలా ఉంటే మెగా , అల్లు ఫ్యామిలీల మధ్య గత కొంతకాలంగా విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి నంద్యాల వెళ్లి మరీ తన మద్దతు ప్రకటించారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది. పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది.