వైసిపి డీఎన్ఏలోనే లోపం ఉందా?
వైసీపీ ధోరణి చూస్తే దాని డీఎన్ఏలోనే ఏదైనా లోపం ఉందా? అనే అనుమానం కలుగుతుంది. ఆ పార్టీలో పైనుంచి సోషల్ మీడియా కార్యకర్తల వరకు అందరి ధోరణి ఒకేలా ఉంటుంది. పోలీసులు తనని అరికాళ్ళు వాచిపోయేలా కొడుతుంటే, జగన్ తాడేపల్లి ప్యాలస్లో కూర్చొని ఆ వీడియోని చూస్తూ పైశాచిక ఆనందం అనుభవించారని మాజీ వైసీపీ, ప్రస్తుత ఎంఎల్ఏ ఎంపీ రఘురామ కృష్ణరాజు స్వయంగా వెల్లడించారు.
జగన్లో ఉన్న ఈ అవలక్షణం వైసీపీలో కిందస్థాయి వరకు ఉందని నిరూపిస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు. శుక్రవారం విడుదల కాబోతున్న విశ్వక్ సేన్ తాజా చిత్రం లైలాకి వ్యతిరేకంగా#బాయ్కాట్ లైలా అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమాలో నటించిన పృధ్వీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ, "ఈ సినిమా మొదట్లో 150 గొర్రెలు ఉండేవి. పూర్తయ్యేసరికి 11 మాత్రమే మిగిలాయి," అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఇందుకు వైసీపీలు హర్ట్ అయితే ఆయనతోనే తేల్చుకోవాలి కానీ 'లైలా'పై ప్రతీకారం తీర్చుకుంటున్నారు.
వైసీపీతో జగన్ ఏపీ రాజకీయాలలో అడుగుపెట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కూటమి పార్టీలు, వాటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో, వైసీపీ సోషల్ మీడియాలో ఎంత దారుణంగా పోస్టులు పెడుతోందో అందరూ గమనిస్తూనే ఉన్నారు. చివరికి శాసనసభలో జగన్ సమక్షంలోనే మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు తదితరులు చాలా అనుచితంగా మాట్లాడుతున్నప్పుడు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చాలా దారుణంగా మాట్లాడుతున్నప్పుడు జగన్ చిర్నవులు చిందిస్తూ పైశాచికానందం అనుభవించారు తప్ప తప్పని వారించలేదు. జగన్ స్వయంగా పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారో అందరూ విన్నారు. పృథ్వి వ్యాఖ్యలపై హీరో విశ్వక్ క్షమాపణ చెప్పినా సోషల్ మీడియాలో #బాయ్కాట్ లైలా ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. రూ.30 కోట్లు పెట్టి తీసిన ఓ సినిమాని దెబ్బ తీయాలనుకోవడం వారికి తప్పుగా అనిపించడం లేదంటే అది ఖచ్చితంగా డీఎన్ఏ లోపమే అనిపించక మానదు.