మరో విమాన ప్రమాదం: 179 మంది మృతి

సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ముయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 85 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో మొత్తం 175మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది విమానంలో ఉన్నారు.
కాగా.. వారిలో ఇద్దరు సిబ్బందిని ప్రాణాలతో కాపాడారు. ఇప్పటి వరకు 85 మంది మృతి చెందారని.. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని యాంహాప్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. కాగా.. కేవలం ఇద్దరు ప్రయాణికులు మాత్రమే థాయ్ కు చెందిన వారని.. మిగతా వారందరూ సౌత్ కొరియన్లే నని పేర్కొంది. ఈ ఘటనలో విమానం మొత్తం పూర్తిగా కాలిపోయిదని అధికారులు తెలిపారు. ఈ విమాన ప్రమాదంపై తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ స్పందించారు. తక్షణమే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇంటీరియర్, ల్యాండ్ మంత్రిత్వశాఖ, పోలీసులు, అగ్నిమాపక శాఖకు మార్గదర్శకాలు జారీ చేశారు. ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు.
విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అప్పటికే ల్యాండింగ్కు యత్నించి విఫలమైందని అధికారులు పేర్కొన్నారు. రన్వే చివరికి వస్తున్న సమయంలో కూడా వేగాన్ని నియంత్రించుకోవడంలో విఫలమైనట్లు చెప్పారు. ఇది ఎయిర్పోర్టు గోడను ఢీకొనడంతో విమానంలోని ఫ్యుయల్ ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించినట్లు తెలిపారు. కొందరు ప్రత్యక్ష సాక్షులు విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్ గేర్, టైర్లు పనిచేయడంలేదని పేర్కొన్నారు. ఏదైనా పక్షిని ఢీకొనడం వల్లే అవి పనిచేయకపోయి ఉండొచ్చన్న అనుమానాలున్నాయి. ఇకపోతే, జేజు ఎయిర్ బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పింది. "మా శక్తి మేరకు ప్రతీది చేస్తాం. ప్రమాదానికి చింతిస్తున్నాం. బాధిత కుటుంబాలకు మా హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నాం" అని ప్రకటనలో పేర్కొంది.